ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను

ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను
- ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
దర్శి, ఆంధ్రప్రభ ; ప్రజల కోసం,పార్టీ కోసం పనిచేసిన సర్పంచ్ లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. గురువారం సాయంత్రం దర్శి లోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలలో వైసీపీ పార్టీ తరఫున గెలిచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేస్తున్న సర్పంచు లను ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు దేవుళ్ళులాగా సేవలు అందించిన ఘనత సర్పంచ్లదేనన్నారు. సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులను కూడా మార్చకోలేని పరిస్థితి ఏర్పడిందని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తాన్ని ఇప్పిస్తానని,కష్టాల్లో ఉండి కూడా పని చేశారని,ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ నా గెలుపు కోసం కృషి చేసి నన్ను గెలిపించారని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ గెలుపు కోసం అమ్మ నేను ప్రతి గడప తిరుగుతామన్నారు.
ఎన్నో సమస్యలు వున్నా కూడా కష్టపడదామని, పదవులు అయిపోయినా కూడా అందరూ కలసి పని చేద్దామన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని మన నాయకుడు జగన్ ను సీఎం గా చేసుకోవాలన్నారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కొంత మంది సర్పంచ్ ల చెక్ పవర్ కూడా తీసేయటం తమకు బాధ కలిగించిందన్నారు. మిమ్మల్ని అందరిని ఈ రోజు సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల సర్పంచ్ లు వైసీపీ మండల అధ్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
