ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఎస్పీ, కలెక్టర్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సరస్వతి పుష్కరాలు పురస్కరించుకొని మూడవరోజు కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే ఆర్టిసి, ప్రైవేట్ వాహనాల్లో భారీగా భక్తులు తరలి రావడంతో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రంగంలోకి దిగి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
కాళేశ్వరంలో అకాల వర్షం – పుష్కరాలపై కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ ల సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి నుండి ఇద్దరూ జిల్లా బాస్ లు సరస్వతి ఘాట్, టెంట్ సిటీ, స్టాల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
వర్షం కారణంగా విద్యుత్తులో తాత్కాలిక అంతరాయం ఏర్పడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టి మళ్లీ విద్యుత్ సరఫరా కొనసాగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత సిబ్బందికి సూచనలు, మార్గదర్శకాలు అందజేస్తున్నారు.