హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సాధికారత, లింగ సమానత్వం సాధించే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోనూ మహిళలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని తన శుభకాంక్షలల్లో రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, అలుపెరగని శ్రమతత్వంతో పనిచేస్తున్న నారీశక్తికి ప్రత్యేక వందనాలు తెలియజేశారు.
మహోన్నతమైంది మహిళల త్యాగం – కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన శుభాకాంక్షల సందేశంలో స్త్రీశక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేశాయని కేసీఆర్ గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పారు.