అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

  • కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • 2 కే రన్ లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, మేయర్

నిజామాబాద్, ఆంధ్రప్రభ : అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2 కే రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2 కే రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్ధవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంచి పేరు తేవాలన్నారు. వైద్య శాఖతో సమన్వయం చేసుకుని మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా, 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం హెచ్.పీ.వీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారం అయ్యేలా తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు.

విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలి..

ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహ దపడాలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధి కారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply