సూర్యపేట్, ఆంధ్రప్రభ : కోదాడ కేంద్రంగా ముఖ్యమంత్రి(Chief Minister) సహాయ నిధి చెక్కుల కుంభకోణంలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లబ్ధిదారుల చెక్కులను నకిలీ పేర్లతో రీవాలీడేట్(Revalidate) చేసి డబ్బులు కాజేస్తున్న ఈ ముఠా వద్ద నుంచి నగదుతో పాటు డ్రా చేయని చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కుంభకోణానికి పాల్పడుతున్న ఆరుగురి ముఠాను(Gang) అరెస్టు చేశారు. లబ్ధిదారులకు చెందిన చెక్కులను నకిలీ పేర్లతో రీవాలీడేషన్ చేయించి ఆ డబ్బును డ్రా చేయడానికి పాల్పడ్డారు. మొత్తం 44 చెక్కులకు సంబంధించి 38 చెక్కులను ఇప్పటికే విత్ డ్రా చేసిన ముఠా, మిగిలిన ఆరు చెక్కుల(Cheques)ను కూడా విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసుల(Police)కు చిక్కారు.
పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.30 లక్షల నగదు, 6 డ్రా చేయని చెక్కులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కె. నరసింహ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, పట్టణ సీఐ శివశంకర్ పర్యవేక్షణలో ఈ అరెస్టులు జరిగాయి.

