కర్నూలు. బ్యూరో, మే 30, ఆంధ్రప్రభ : పరిశ్రమల స్థాపనకు వీలుగా నిర్దేశించిన గడువు లోపుగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులకు అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు సంబంధించి 9 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటికి వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఈఈ ని ఆదేశించారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ ఆరా తీశారు. ల్యాండ్ లెవెలింగ్, ముళ్ళ పొదల తొలగింపు పూర్తయిందని, సోమవారం మెటీరియల్ వస్తోందని ఏపీఎంఐపీ పిడి కలెక్టర్ కు వివరించారు. ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలో 10 ఎకరాలను కేటాయించడం జరిగిందని, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇందులో ఎంఎస్, ఎంఈ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఇందుకు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఐఐసీ జడ్ఎం ను ఆదేశించారు. బనవాసి టెక్స్ టైల్ పార్కు లో త్వరితగతిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీఐఐసీ జడ్ఎం ను ఆదేశించారు. అలాగే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటునకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇండస్ట్రీస్ జీఎంను ఆదేశించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 24 క్లెయిమ్ లకు రూ.1.61 కోట్లకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ క్రింద 17 క్లెయిమ్స్ కు రూ. 1,57,50,166లు, వడ్డీ రాయితీ కింద ఒక క్లెయిమ్ కు రూ. 13,813లు, విద్యుత్ ఖర్చు రీయింబర్స్మెంట్ క్రింద ఒక క్లెయిమ్ కు సంబంధించి రూ 36,663లు, సేల్స్ టాక్స్ రీయింబర్స్మెంట్ క్రింద 5 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.3,35,265లు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కేటగిరీల వారీగా జనరల్ కేటగిరీలకు 7, ఎస్సీ లకు 15, ఎస్ టి లకు 2 మొత్తంగా 24 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్చార్జి జిఎం అరుణ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ఎంఐపీ పిడి ఉమా దేవి,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ కుమార్ రెడ్డి, ఐలా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, జిల్లా దళిత్ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.