Vijayawada | ప్రతి నెలా 1న ఠంచన్గా పింఛన్
ఎన్టీఆర్ భరోసాతో పేదల జీవితాలకు చేయూత
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1న ఠంచనుగా పెన్షన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. పేదలకు సేవలో.. ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ (Vijayawada) గులాబీ తోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ.. జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు రూ. 98.91 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారావు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

