మాస్కో: ఉక్రెయిన్తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి కీవ్తో ప్రత్యక్ష చర్చల కు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
ఈ చర్చలు ఇరుదేశాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలన్నారు. ఈ మేరకు ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా కీవ్ ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లు పుతిన్ ఆదివారం ప్రకటించారు.
గురువారం ఇస్తాంబుల్ వేదికగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధికారులను పుతిన్ కోరారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్తో మాట్లాడతానని అన్నారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, ‘విక్టరీ డే’ కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు. అయినప్పటికీ ఆ సమయాల్లో ఉక్రెయిన్ ఈ ఒప్పందాలను ఉల్లంఘించి.. 524 వైమానిక డ్రోన్లు, 45 సముద్ర డ్రోన్లు, అనేక పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపించారు. తమ సైన్యం కీవ్ దాడులను తిప్పి కొట్టిందని తెలిపారు.
బేషరతు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధం
కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటే ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం ఆలోచనలను విరమించుకోవాలని, తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వారి బలగాలను ఉపసంహరించుకోవాలని పుతిన్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో ఇరు దేశాలు సంధి కోసం ముసాయిదా ఒప్పందాన్ని చేసుకున్నాయి. నాటి ఒప్పందం గురించి పుతిన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పట్లో సంధి చర్చలు విరమించుకుంది తాము కాదని..ఉక్రెయిన్ వాటి నుంచి వైదొలిగిందన్నారు.
ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేసినందుకుగాను అమెరికా, భారత్ చైనా, బ్రెజిల్, ఇతర మధ్యప్రాచ్య, ఆఫ్రికన్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు.
కాగా..రష్యాతో పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్, దాని మిత్రపక్ష దేశాలు శనివారం వెల్లడించాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజులు కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. సంధికి అంగీకరించి, శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైనా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ మేరకు నాలుగు దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.