Pakistan | ఉగ్రవాది మూసా..పాక్ కమెండో!

పాక్ సైన్యం నుంచి ల‌ష్క‌రే తోయిబాలోకి
ఉగ్ర‌వాదుల‌కు, పాక్ సైన్యానికి లింకులు
ఇదే నిద‌ర్శ‌నం అంటున్న ద‌ర్యాప్తు బృందం
ఎన్ఐఏ ద‌ర్యాప్తులో వెలుగుచూస్తున్న వాస్త‌వాలు
చిక్కిన‌ట్టే చిక్కి నాలుగుసార్లు ఎస్కేప్ అయ్యారు
ఈ సారి ఖ‌తం చేస్తామంటున్న అధికారులు

శ్రీ‌న‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ :
పహల్గాం టెర్ర‌ర్ అటాక్‌లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్తాన్‌ మాజీ క‌మెండో అని తెలిసింది. హషీమ్‌ మూసా అనే ఉగ్రవాది గతంలో పాక్‌ సైన్యంలోని ప్రత్యేక దళంలో పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి మూసా పని చేస్తున్నట్లు స‌మాచారం అందింది. లష్కరే తోయిబా సూత్రధారులే మూసాను కశ్మీర్‌కు పంపినట్లు ఆధారాలు ల‌భించాయి. కాగా, ఇప్పటికే ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకొంది. వారిలో 15 మంది టెర్రిరిజం ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. ‘హిషిమ్‌ మూసా పాకిస్థాన్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలిసింది’ అని దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలకు ఇది నిదర్శనమని చెప్పారు.

ఇత‌ర ఘ‌ట‌న‌ల్లోనూ మూసా హ‌స్తం..

కాగా, పాకిస్తాన్‌ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్‌ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణ సమయంలోనే వీరిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తారు. దాంతోపాటు యుద్ధరంగంలో ఎత్తుగడలు నేర్పిస్తారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంలోను, నేరుగా చేతులతో పోరాడటంలోను వాళ్లు నిపుణులు. పహల్గాం దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలో గగన్‌నగర్‌, గండేర్‌బల్‌ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లోనూ పాల్గొన్నారు. హషిమ్‌ మూసా మాత్రం ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నాడు. ఇక.. జునైద్‌భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్లు అధికారులు గుర్తించారు.

చిక్కిన‌ట్టే చిక్కి.. నాలుగుసార్లు త‌ప్పించుకున్నారు..

పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి ప్రణాళికను అమలుచేసేందుకు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయవరకు కాలి నడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదులు సైనిక శిక్షణ పొందారనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం ముమ్మరంగా వేటాడుతోంది. వాళ్లు భద్రతా దళాల నుంచి నాలుగుసార్లు త్రుటిలో తప్పించుకున్నారు. త్వరలోనే వాళ్ల కథ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *