తరాలకు వారధులు.. భవిష్యత్తుకు నిర్మాతలు..
వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపద..
వారికి ఆత్మీయతను పంచి గౌరవంగా జీవించేలా ఊతమిద్దాం…
వయోవృద్ధుల హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాం…
జిల్లాలో వినూత్నంగా టైమ్ బ్యాంక్ విధానం అమలుకు చర్యలు…
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి సీనియర్ సిటిజన్స్ తోడ్పాటునందించాలి…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) తరాలకు వారధులుగా.. భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతిఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని, నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపద అని.. వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలానే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి వయోవృద్దులు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులు పొందేందుకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృద్దులకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్ అందిస్తోందని అన్నారు. నేరగాళ్లకు, మోసగాళ్లకు మొదటి టార్గెట్ వృద్దులేనని.. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబూరావు, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.కామరాజు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.