New Records | మ‌హేంద్రుడి ఖాతాలో మ‌రో రికార్డ్ …

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. చెన్నై విజయంలో మ‌హీ కీల‌క‌పాత్ర పోషించాడు. కీపింగ్‌లో త‌న‌దైన‌శైలిలో అద‌ర‌గొట్టిన ఎంఎస్‌డీ బ్యాటింగ్‌లోనూ 11 బంతుల్లోనే 26 ప‌రుగులు చేసి, ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ (పీఓటీఎం) అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయ‌ర్ (43 ఏళ్ల 281 రోజులు)గా ధోనీ నిలిచాడు. అంత‌కుముందు ఈ రికార్డు స్పిన్న‌ర్ ప్ర‌వీణ్ తాంబే (43 ఏళ్ల 60 రోజులు) పేరిట ఉండేది.

మ‌హేంద్రుడి రికార్డుల మీద రికార్డులు!
ఇక నిన్న‌టి మ్యాచ్‌లో మ‌హేంద్రుడు రికార్డుల మీద రికార్డులు న‌మోదు చేశాడు. ఐపీఎల్‌లో 200 ఔట్స్ (స్టంపౌట్లు, ర‌నౌట్లు, క్యాచ్‌లు) చేసిన తొలి వికెట్ కీప‌ర్‌గా నిలిచాడు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్య‌ధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్స‌ర్లు కొట్టిన బ్యాట‌ర్‌గానూ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్య‌ధిసార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో ఆట‌గాడిగా అవ‌త‌రించాడు. ఇప్ప‌టివ‌రకు ధోనీకి 18 పీఓటీఎం అవార్డులు వ‌చ్చాయి. ఈ జాబితాలో రోహిత్ శ‌ర్మ (19) అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఈ అవార్డు నూర్ కు ద‌క్కాల్సింది…

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యానంత‌రం చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మాట్లాడుతూ.. మ్యాచ్‌ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం. ఘనమైన భవిష్యత్తు ఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్‌ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.

అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్‌ రషీద్‌ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్‌ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది . ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది.

ఇక ఈరోజైతే నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు అని అనిపించింది. నిజానికి నూర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు అని పేర్కొన్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను నూర్‌ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *