New CM | ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా?
న్యూ ఢిల్లీ – ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధికారికంగా రేఖ గుప్తా పేరును ఏ క్షణంలోనైనా బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
రేఖ గుప్తా..
షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావించింది. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖ గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖ గుప్తాకు అవకాశం దక్కుతోంది.
గ్రాండ్ గా ప్రమాణ స్వీకార మహోత్సవం..
ఇక ఈ నెల 20న రాంలీలా మైదానంలో అత్యంత గ్రాండ్గా ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని భావిస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రామ్కి హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.