న్యూ ఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ఉన్న ఎంబీబీఎస్ (MBBS) , బీడీఎస్ (BDS) వంటి వైద్య విద్యా కోర్సుల్లో (Medical Courses ) ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) శనివారం విడుదల చేసింది.
అంతకు ముందు ఫైనల్ కీని (Final Key ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల (Relesed ) చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్ కార్డులు అందుతున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్
https://neet.nta.nic.in/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.
పరీక్షకు 20.80 లక్షల మంది హాజరు
గత నెల మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షకు 20.8 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,400కు పైగా కేంద్రాల్లో పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ సారి నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గింది. నిరుడు జాతీయంగా 23లక్షలకుపైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా, ఈ సారి 20లక్షల మంది మాత్రమే రాశారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి 72,507 మంది అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షను రాశారు.
తాజా అంచనాల ప్రకారం రాజస్థాన్కు చెందిన ఓ విద్యార్థి 700 మార్కులకు 690కి పైగా మార్కులు సాధించారు. ఇక తెలంగాణ నుంచి 668 టాప్ మార్కులుగా ఉంది . రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్, రెండు డీమ్డ్, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తంగా 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నట్లు సమాచారం.
ఎపి, తెలంగిాణ విద్యార్ధుల జోరు….
ఈసారి ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ నుంచి ఏకంగా 41,584 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకును కైవసం చేసుకోగా, షణ్ముఖ నిషాంత్ 37వ ర్యాంకు, మంగరి వరుణ్ 46వ ర్యాంకు, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దర్బా కార్తీక్రామ్ 19వ ర్యాంకు, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు.
దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.