నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి..
ఎర్రగడ్డ, (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని వాసవి బుద్ధవనం వాకర్స్ మీట్తో పాటు నంద నగర్, భవాని నగర్, జహేరా గుల్షన్ బాగ్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చిందని, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేయడంతో ప్రతీ నెల రూ. 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామని వివరించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఈ ఎన్నికల్లోనూ ఓటుతో గుణపాఠం చెప్పాలని అన్నారు.

