ముంబయి – పాకిస్థాన్తో యుద్ధం జరిగినపుడు భారత నేవీ గనుక రంగలోకి దిగి ఉంటే.. పాకిస్థాన్ నాలుగు ముక్కలయి ఉండేదని అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. యుద్దం సమయంలో భారత నేవీ మౌనంగా ఉంటూనే.. శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నేవీ పాత్రను ఆయన కొనియాడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ను నేడు ఆయన సందర్శించారు. అందులోని సిబ్బందితో ఆయన మాట్లాడారు.. ఆపరేషన్ సిందూర్ లో వారు చేసిన సేవలను ప్రశంసించారు.

అనతరం ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్పై నిలబడి మాట్లాడుతూ.. ‘ 1971లో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం జరిగినపుడు భారత నేవీ కూడా యుద్ధంలో పాల్గొంది. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈ సారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ మౌనంగా తన పని చేసుకుపోయింది. ప్రతీ భారతీయుడ్ని ఆశ్చర్యపరిచింది. మౌనంగా ఉంటూనే .. పాక్ ఆర్మీని ఓడించటంలో విజయవంతం అయింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ పాక్ టెర్రర్ బేస్లను ధ్వంసం చేసింది.

అప్పుడు భారత నేవీ బలగాలు ఎంతో దూకుడుగా అరేబియా మహా సముద్రంలో మోహరించాయి. పాక్ నేవీ.. నీటి సరిహద్దులు దాటి ఇటువైపు రావడానికి ధైర్యం చేయలేకపోయింది. పాకిస్థాన్ చాలా అదృష్టం చేసుకుంది. ఒక వేళ ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ రంగంలోకి దిగి ఉంటే పాక్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పటి వరకు జరిగిందంతా వామ్ అప్ మాత్రమే. ఈ సారి పాకిస్థాన్ యుద్ధానికి దిగితే.. నేవీ కూడా రంగంలోకి దిగుతుంది. అప్పుడు పాక్ పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని అన్నారు.