కోలకతా – భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రంలో పలు అభివృద్ధికారక ప్రాజెక్టులకు నేడు ప్రధాని పశ్చిమ బెంగాల్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. నమ్చీ జిల్లాలో రూ.750 కోట్లతో నిర్మించనున్న 500 పడకల జిల్లా ఆసుపత్రి, సాంగాచోలింగ్లోని ప్యాసెంజర్ రోప్వే, గాంగ్టాక్ జిల్లాలోని అటల్ అమృత్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా ప్రసంగిస్తూ,. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలే కేంద్రంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగిందన్న విషయాన్ని కూడా మోదీ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. దీంతో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని తెలిపారు. ‘గత నెలలో పహల్గాం దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. భారత్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసేవారికి తగిన సమాధానం. పహల్గాంలో ఉగ్రవాదులు చేసింది మానవత్వంపై దాడి. ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైంది’ అని చెప్పుకొచ్చారు.
వాతావరణం అనుకూలించకపోవడంతో…
వాస్తవానికి ప్రధాని మోదీ నేడు సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా ఈ పర్యటన రద్దైంది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాహస క్రీడలకు హబ్గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘గ్యాంగ్టక్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను నేరుగా పాల్గొనాలనుకున్నాను. అందుకు వాతావరణం సహకరించలేదు. సిక్కిం సాహస క్రీడలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు.