నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా రైతులు, ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి గడివేముల మండలాల్లో శుక్రవారం భారీ వర్షం, వడగళ్ల వాన కురిసింది. దీంతో చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామంలో పిడుగుపాటుకు ఒక చెట్టుతో పాటు వరి పంటలు పూర్తిగా కాలిపోయాయి.
ఆత్మకూరు నుండి కర్నూలు వెళ్లే జాతీయ రహదారిపై చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీనితో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
జూటూరు, తుమ్మలూరు, పాములపాడు తదితర గ్రామాల్లో బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లైన్ మెన్ లు, అధికారులు విద్యుత్ సరఫరాకు తక్షణ చర్యలు తీసుకున్నారు.
కొత్తపల్లి మండల కేంద్రంలో వడగళ్ల వాన కురిసి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక సహాయం కోరుతున్నారు.



