టపాసుల విక్రయదారులకు నంద్యాల ఏఎస్పీ జావళి ఆదేశాలు
- అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లోనే విక్రయాలు జరపాలి
- అతిక్రమిస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కేసులు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల ఏఎస్పీ మందా జావళి హెచ్చరించారు. శనివారం స్థానికంగా ఏఎస్పీ మాట్లాడారు. విక్రయదారులు సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచినా, వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా.. లేదా.. అనే విషయమై పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
జనసంచారం ఉన్న ప్రదేశాల్లో, నివాస ప్రాంతాల్లో టపాకాయలు విక్రయించరాదని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నరు.బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను టపాసుల విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్కు సమాచారం చేరవేసిన వారి వివరాలు గోప్యంగా సమాచారం అందించాలని, ఉంచుతామని తెలిపారు.