గంపలగూడెం, మే 14(ఆంధ్రప్రభ): జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు కావూరి శశిరేఖ, మాజీ అధ్యక్షులు బెల్లం మధుసూదన రావు, వడ్లమూడి రాజశేఖర్ మంత్రికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని సీతారాం ప్రసాద్, మాజీ జడ్పీటీసీ పామర్తి కొండలరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.