కరీంనగర్ టవర్ సర్కిల్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాత్ర విశిష్టమైనదని, యువతకు ఆయన ఆదర్శనీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ… శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకొని ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వారి తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు, అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూ, రాణిస్తూ.. అభివృద్ధి పదాన పయనింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాలకు ఒక ఐకాన్ శ్రీధర్ బాబు అని, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా శ్రీధర్ బాబు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా శుభపరిణామమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా జీవించాలని పిలుపునిచ్చారు.
విజేతలకు జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ప్రత్యేక వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటపల్లి స్వామి, ప్రధాన కార్యదర్శి, ప్రతినిధులు రమేష్, ముస్తఫా, నరేష్, బాబు శంకర్, మధుకర్, గంగరాజు, శివప్రసాద్, లక్ష్మణరావు, రామాంజనేయులు పాల్గొన్నారు.