కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి.
ఇక చివరి రోజైన మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్తు లక్ష్యాలపై పార్టీ అధినేత, ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనాలు తరలిరానున్నారు.
గురువారం సమావేశం జరిగే చోట లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కడపకు వచ్చే మార్గాల్లో మరో 2 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండోరోజు తరలివచ్చారు. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇక మూడో రోజు మరింత ఎక్కువగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనాలు రానున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గత 4-5 రోజుల నుంచి కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది.