Lok Sabha | భారత మాతను అమ్మేశారు!

Lok Sabha | భారత మాతను అమ్మేశారు!
Lok Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అగ్రరాజ్యం అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్, అంతర్జాతీయ ఎప్స్టీన్ ఫైల్స్ లపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో పెను సంచలనం సృష్టించాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. అయితే, మన దేశ ప్రజలకు ఏ దేశంతోనైనా పోటీ పడే సామర్థ్యం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండటంతో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్ను రాహుల్ తప్పుబట్టారు. అమెరికా సూపర్ పవర్గా కొనసాగాలంటే భారత్ డేటా అవసరమని, అందుకే ఈ ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “భారత మాతను అమ్మేశారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.

అనిల్ అంబానీ, అదానీ ప్రస్తావన తీసుకురావడంతో సభలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ లో అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్దీప్ పూరి పేర్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
