Liquor Scam | సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన ఎంపి మిథున్ రెడ్డి..

విజ‌య‌వాడ – లిక్క‌ర్ స్కామ్ కేసులో సిట్ విచార‌ణ‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈరోజు ఉద‌యం విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌, ఆ త‌ర్వాత అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన వేల కోట్ల మ‌ధ్యం కుంభ‌కోణంలో భారీగా అనుచిత ల‌బ్ధి పొందిన సంస్థ‌ల్లో ఒక‌టైన అదాన్ డిస్టిల‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెన‌క రాజ్ క‌సిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నార‌ని, మాజీ ఎంపీ, వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి శుక్ర‌వారం బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో నిన్న ఆయ‌న ఇచ్చిన వాంగ్మూలం మేర‌కు మిథున్‌రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు విచారించే అవ‌కాశం ఉంది.

విచార‌ణ‌కు హాజరుకాని క‌సిరెడ్డి
ఇదే కేసులో నిందితుడిగా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేడు విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు.. ఇదే స‌మ‌యంలో ఆయ‌న మరోసారి బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది.

కాగా, వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ స్కామ్ జ‌రిగింద‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ద‌ర్యాప్తున‌కు సిట్‌ను ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *