- భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫోన్ల ట్యాపింగ్
- సీటుకు ఎసరు భయంతో రేవంత్ చర్య
- ఖమ్మం ప్రెస్ మీట్ కెటిఆర్ ఆరోపణలు
- ఫోన్ ట్యాపింగ్ నిజమా కాదా చెప్పాలంటూ నిలదీత
- త్వరలోనే అన్ని అధారాలు బయటపెడతానని వెల్లడి
ఖమ్మం : ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ల ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఖమ్మంలో నేడు మీడియాతో మాట్లాడుతూ… దమ్ముంటే రేవంత్రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానన్నారు.
లోకేష్ను కలిస్తే తప్పేంటీ?..
ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదని అంటూ.. కలిసినా తప్పేంటి? అని సీఎం రేవంత్ (CM Revanth) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. లోకేష్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. లోకేష్ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అవసరమైతే పగటి వేళలోనే లోకేష్ ను కలుస్తానని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రికి రేవంత్ పిరికి సన్నాసాని, చర్చకు రమ్మంటే పారిపోతున్నారని ఫైరయ్యారు. రేవంత్రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని… చిట్చాట్లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని సెటైరికల్ పంచ్ వేశారు. రేవంత్ ను ఎర్రగడ్డకు పంపే సమయం వచ్చేసిందన్నారు.
నాపై ఆరోపణలు ఎన్నో.
“దుబాయ్లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం అని అన్నారు కెటిఆర్. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలని భావించే తాను జీవితంలో ఏనాడూ సిగరెట్ కూడా తాగలేదన్నారు. అయినప్పటికీ తనకు డ్రగ్స్ అలవాట్లుఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తన విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు, ఓ సారి కార్ రేసింగ్ అంటున్నారు. రేవంత్రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం చేకూరలేదని తేల్చేశారు కెటిఆర్ .
సీఎం రేవంత్రెడ్డి నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. తాను ఏం చేసినా.. బాజాప్త చేస్తా నన్నారు. . డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. రేవంత్రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యమని మండిపడ్డారు.. గాసిప్ల మాయలో పడి.. ఆరు గ్యారంటీలను మర్చిపోదామా? అని ప్రశ్నించారు.
బనకచర్ల పై మరో ఉద్యమం ..
బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారన్నారు. దిల్లీ భేటీ అజెండాలో బనకచర్ల అంశమే లేదన్నారనని, కానీ అది వాస్తవం కాదని కేంద్రమే తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు.. బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నదని సీఎంపై నిప్పులు చెరిగారు. రేవంత్రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.