Krishna District : శివోహం Andhra Prabha Spot News

Krishna District : శివోహం Andhra Prabha Spot News
మార్మోగిన శివాలయాలు
కృష్ణానదిలో భక్తజనం పరవళ్లు
క్యూ లైన్లన్నీ ఆలయాలు కిటకిట
(ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో):

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగ్రాయి. హరహర శంభో శంకరా అంటూ స్వామివారి నామాన్ని జపిస్తూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామి వారి దేవాలయం, మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారి దేవాలయం, పామర్రు నియోజకవర్గంలోని ఐలూరులో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి దేవాలయం, అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలోని బాలకోటేశ్వరస్వామి, మచిలీపట్నంలోని కాలేఖాన్ పేటలో ఉన్న శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారి దేవాలయాలతోపాటు పలు గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో భక్తులు కిక్కిరిపోయారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచి పెదకళ్లేపల్లిలో స్వయంభవుగా కొలువై ఉన్న శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారిని ఉదయాన్నే భక్తులు దర్శించుకున్నారు.

కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సుమారు 70 వేల మంది మందికిపైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కృష్ణానది స్నానఘాట్లు, ధుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం వద్ద -ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా యనమలకుదురు వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఐలూరు, యనమలకుదురు పెదకళ్లేపల్లి, మద్దూరు గ్రామంలోని రుద్రేశ్వరి ఆలయం వద్ద భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివార్ల దర్శనానికి విచ్చేశారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్నానఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. పితరులకు కుటుంబీకులకు పిండతర్పణాలు అర్పించారు. జంగం దేవరలు శంఖం ఊదుతుండగా, పుణ్యస్నానాలు ఆచరించటం జరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. -జిల్లాలోని పలు దేవాలయాల్లో కావాల్సిన ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవస్థానం అధికారులు పర్యవేక్షించారు.



