Kalvakuntla Kavitha | అది భిక్ష కాదు.. హక్కు!

Kalvakuntla Kavitha | అది భిక్ష కాదు.. హక్కు!
- బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే…
- బీసీల ద్రోహిగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోనుంది
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha| ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లతో రిజర్వేషన్(Reservation) కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొనడం సరికాదని, బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదని, హక్కు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఖమ్మం జిల్లా(Khammam District)లో పర్యటించిన కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ నిప్పులు చెరిగారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయలేదని మండిపడ్డారు. సీఎం ఒక్క స్టెప్ కూడా సరైంది తీసుకోలేదనీ అన్నారు. పార్టీలపరంగా సీట్లతో రిజర్వేషన్లు ఎందుకని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కావాలని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు చేశారని, ప్రధాని నరేంద్ర మోడీని కలవలేదని కవిత మండిపడ్డారు. పార్టీల పరంగా రిజర్వేషన్లు అంటున్న రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా నిప్పులు చెరిగారు. సర్పంచ్ ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) 52 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు ఆ విధంగా నిర్వహించడం తగదన్నారు. బీసీల ద్రోహిగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోనుందని ఆరోపించారు.
ప్రజా సమస్యల కోసమే జాగృతి జిల్లాలో తిరుగుతూ పోరాటం చేస్తుందని వివరించారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకే పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు 12 ఏళ్లు(12 years) కావస్తున్న పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 7000 కోట్ల నుండి 19 వేల కోట్లకు పెంచారని, అయినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
Kalvakuntla Kavitha |ఎర్రజెండా పార్టీలను కలుపుకుంటూ…
రాష్ట్రంలో ఎర్రజెండా పార్టీలను కలుపుకొని జాగృతి పోరాటాలు చేస్తుందని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధించడమే జాగృతి లక్ష్యమని, అన్నివర్గాల వారికి, మహిళలకు అధికారం రావడమే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఫ్రెంచ్ విప్లవం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జాగృతి పోరాడుతుందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ(Market Committee)ల్లో రిజర్వేషన్ల ఘనత కేసీఆర్ దేనని అభివర్ణించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నచిన్న హాస్టల్ భవనాల లాంటి సమస్యలను కూడా పరిష్కరించడం లేదని కవిత ఆరోపించారు. అవకాశం.. అధికారం.. ఆత్మగౌరవం.. నినాదంతో జాగృతి(Jagruti) ముందుకు సాగుతుందని వివరించారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం లో మూడు హత్యలు జరిగినా పోలీసులు కేసుల విచారణ పూర్తి చేయలేదని , ఈ అంశంపై డీజీపీని కలవనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు హత్యల(police killings) పై మౌనం పాటించడం సరైనది కాదన్నారు. హత్యలు, హత్య రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు.
Kalvakuntla Kavitha |ఆపరేషన్ కగారు పేరుతో
సింగరేణి కార్మికుల సమస్యలపై ఈనెల 19న హైదరాబాదులోని సింగరేణి భవనాన్ని ముట్టడించనున్నట్లు కవిత తెలిపారు. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం విధ్వంసం సృష్టించడం తగదన్నారు. పత్తి కొనుగోళ్లలో తేమశాతం 20 అనుమతించాలని, ఆ రీతిలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పత్తి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) లాంటి గొప్ప నాయకుడ్ని వదులుకోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పిదం చేసిందని ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా, ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి పరంగా పోరాడుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు పాల్గొన్నారు.
KTR | పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్!
