కాటారం, మే 20 (ఆంధ్రప్రభ) : సరస్వతి పుష్కరాల్లో పనిచేస్తున్న జయశంకర్ జిల్లా కాటారం మండలం గంగారానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సఫాయి కార్మికుడు మంతెన శ్రీనివాస్ వడదెబ్బతో మృతి చెందాడని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గ నేత, భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాల వద్ద 12గంటల డ్యూటీ వలన ఎండదెబ్బ కొట్టి బ్లడ్ కక్కడంతో మంతెన శ్రీనివాస్ అకస్మాత్తుగా మరణించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్లతో పుష్కరాలు చేస్తూ అందులో కార్మికుడు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే మృతుని కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.