ఇస్రో సైతం సరిహద్దుపై గురి
ఈ నెల 18న రీశాట్ బీ రెడీ
పీఎస్ఎల్వీ-సీ 61తో సిద్ధం
భారత నిఘానేత్రంగా రీశాట్-1బీ
(ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్) – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ఉప్రగ్రహాన్ని ప్రయోగిస్తోంది. భూమి ఆనుపానుల గతి స్థితిపై ఉప గ్రహాల మీద ఉపగ్రహాలను సంధించిన ఇస్రో ఈ సారి తాను సైతం అంటూ.. ఉగ్ర జాడల్ని గుర్తించే శాటిలైట్ తో పాకిస్థాన్ గుండెల్లో గునపం దించుంతోంది. అదే రీశాట్ 1 బీ . సరిహద్దులోని బొర్రెల్లో నక్కిన టెర్రర్ నక్కలను భారత సైన్యం ఇట్టే పసిగట్టి మట్టు బెట్టేందుకు ఈ ఉపగ్రహం నయా డిటెక్టివ్ పాత్ర పోషిస్తుంది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో అహర్నిశం పహారా కాసేందుకు ఇస్రో ముహూర్తం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 61 వాహక నౌకను నింగిలోకి వదులుతోంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రీశాట్ 1 బీ దూసుకు పోనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ నిఘా ఉపగ్రహం ‘రీశాట్-1బీ’ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఏర్పాట్లల్లో శాస్ర్తవేత్తలు నిమగ్నమయ్యారు. లాంచింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.
నింగిలో అద్భుత రాడార్
రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన (హై-రిజల్యూషన్) చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగ పడనుంది. దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించ గలదు