రాయలసీమకు జీవనాడిగా నిలిచే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కృష్ణమ్మ ప్రవాహం చూసి తన మనసు పులకరించిపోయిందని తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్టు కింద ఉన్న చివరి పొలాల వరకు నీరు అందించాలన్న తమ కల సాకారమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ప్రభుత్వం రికార్డు సమయంలో కాల్వల విస్తరణ పనులు చేపట్టిందని, అందువల్లే ప్రస్తుతం హంద్రీ-నీవా కాల్వల్లో అత్యధిక సామర్థ్యంతో నీటి ప్రవాహం కొనసాగుతోందని వివరించారు.
ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నింపి, చివరి ఆయకట్టు భూమిని తడపాలన్నదే తమ ఆశయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాల్వల్లో ప్రవహిస్తున్న జలాలు రైతుల ఆశలను నెరవేర్చుతున్నాయని, వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం తమ ప్రభుత్వ సంకల్పానికి మరింత బలాన్నిస్తోందని చంద్రబాబు తెలిపారు.