ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్లేఆఫ్స్లో భాగంగా ఈరోజు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్.. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్పై 20 పరుగులు తేడాతో గెలుపొందింది.
ఇక ఈ విజయంతో ముంబై క్వాలిఫయర్ 2లో అడుగుపెడుతూ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మరోవైపు, ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
బ్యాటింగ్లో దంచికొట్టిన ముంబై !
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా… ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సులు), జానీ బెయిర్స్టో (47; 22 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు) లు గజగజలాడించారు. మొదటి వికెట్కి ఈ జోడీ 84 పరుగులు జోడించి అద్భుత ఆరంభం ఇచ్చింది.
మధ్య ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో), తిలక్ వర్మ (25; 11 బంతుల్లో 3 సిక్సులు) తమ శరవేగ ఇన్నింగ్స్తో ముంబై స్కోరును ముందుకు నెట్టారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.
పోరాడిన సాయి సుదర్శన్.. సుందర్ !
గుజరాత్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగగా, ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ (80) – వాషింగ్టన్ సుందర్ (48) పోరాడుతూ మ్యాచ్ పై ఆశ చిగురించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన భాగస్వామ్యం గుజరాత్ను కొంతదూరం విజయానికి దగ్గరగా నెట్టింది. అయితే, మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కారణంగా గుజరాత్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ను బెంబేలెత్తించారు. స్పిన్నర్లు, పేసర్లు సమర్థవంతంగా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ సాంట్నర్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ పగొట్టారు. దీంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లె కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులు తేడాతో విజయం సాధించింది.
క్వాలిఫయర్ 2 పోరుకు ముంబై సిద్ధం..
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఇప్పుడు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఫైనల్ టికెట్ కోసం ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.