హైదరాబాద్ / వెలగపూడి: హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ , ఎపి ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు లను విడి విడిగా కలిశారు. ముందుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ తో భేటీ అయ్యారు .ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ‘ ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని దత్తాత్రేయ సీఎం రేవంత్ను ఆహ్వానించారు.

అనంతరం వెలగపూడి వెళ్లిన దత్తాత్రేయ అక్కడ సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిశారు. జూన్ 8 న హైదరాబాద్ లో జరిగే పుస్తకావిష్కరణకు రావలసింది గా కోరారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు. ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో ‘జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా’ పేరుతో విడుదలైంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.