IND vs ENG | తొలి రోజు భారత్ ప్రభంజనం…

  • జైస్వాల్, గిల్ శ‌త‌క గర్జన

ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న‌ టెస్ట్ సిరీస్ లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 85 ఓవర్లలో 359/3 స్కోర్‌తో నిలిచింది. ఇది ఇంగ్లండ్‌లో భారత్ సాధించిన అత్యధిక డే 1 స్కోరుగా నిలిచింది. 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో నమోదైన 338/7 రికార్డును ఈ మ్యాచ్‌లో అధిగమించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణయం తప్పిదమైందని భారత బ్యాటర్లు నిరూపించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆరంభించి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. అయితే లంచ్‌కు ముందు బ్రైడన్ కార్స్ రాహుల్‌ను ఔట్ చేసి జైస్వాల్ – రాహుత్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు. అదే సెషన్‌లో బేన్ స్టోక్స్ బౌలింగ్ లో సాయి సుధర్శన్‌ను డకౌట్ గా వెనుదిరిగాడు.

అయితే, ఓపెనర్ జైస్వాల్ – కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ జోడీ ఇంగ్లీష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 3వ వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్ర‌మంలోనే జైస్వాల్ 158 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు.

జైస్వాల్ ఔట్ తర్వాత, గిల్ తో పాటు రిషబ్ పంత్ కూడా జత కలిశారు. వీరిద్ద‌రూ దూకుడుగా ఆడి 138 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ క్ర‌మంలో గిల్ తన టెస్ట్ కెరీర్‌లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోగా, పంత్ 3000 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు. దీంతో పంత్, ఎంఎస్ ధోని తర్వాత 3000+ పరుగులు చేసిన రెండవ భారత వికెట్ కీపర్ కూడా అయ్యాడు.

సెషన్ వారీగా ఆట వివరాలు:

ఉదయం సెషన్: 25.4 ఓవర్లు – 92 పరుగులు – 2 వికెట్లు
మధ్యాహ్న సెషన్: 25.2 ఓవర్లు – 123 పరుగులు – వికెట్లు లేవు
సాయంత్రం సెషన్: 34 ఓవర్లు – 144 పరుగులు – 1 వికెట్

ఈరోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడిపోయినప్పటికీ, బ్యాటింగ్‌లో నాణ్యతను ప్రదర్శించి ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. భారత జట్టు టెస్ట్ సిరీస్‌ను బలమైన దిశలో ప్రారంభించి విజయానికి బలమైన పునాది వేసింది.

Leave a Reply