లీడ్స్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సాధించింది. బజ్బాల్ మంత్రంతో భారత జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచి, అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ తమ రెండవ అత్యంత విజయవంతమైన పరుగుల వేటను పూర్తి చేసింది.
ఈ ఛేదనలో ఓపెనర్లు బెన్ డకెట్ (149) – జాక్ క్రాలే (65) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. భారత బౌలర్లను దంచేస్తూ… 188 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగారు. ఆఖర్లో జో రూట్ (53 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ వికెట్కీపర్ జేమీ స్మిత్ (44 నాటౌట్) అతనికి అద్భుతంగా తోడయ్యాడు. వీరిద్దరి మధ్య 71 పరుగుల అజేయ భాగస్వామ్యం ఇంగ్లాండ్ను గెలుపు దిశగా నడిపించింది.
ఐదు శతకాలు చేసిన తప్పని ఓటమి..
అయితే ఈ ఓటమితో టీమిండియా నిరాశాజనకమైన రికార్డును నమోదు చేసింది. ఐదు వ్యక్తిగత శతకాలు చేసినప్పటికీ ఓటమి పాలైన మొట్టమొదటి జట్టుగా భారత్ నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో మంచి ప్రదర్శన చేసింది. శుభ్మన్ గిల్ (147), రిషభ్ పంత్ (134), యశస్వి జైస్వాల్ (101) శతకాలు సాధించి జట్టు స్కోర్ను 471 పరుగులకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ (4/86), బెన్ స్టోక్స్ (4/66) ముఖ్యంగా మెరిశారు.
ఇంగ్లాండ్ బదులుగా తమ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. డకెట్ (62), ఓలీ పోప్ (106) జట్టును ముందుకు నడిపారు. హ్యారీ బ్రూక్ 99 వద్ద అవుట్ అయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా 5/83తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, ప్రసిద్ధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు.
భారత రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 137 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, వికెట్ కీపర్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 118 పరుగులతో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. వీరిద్దరి మధ్య 195 పరుగుల భాగస్వామ్యం నమోదవడంతో భారత్ 364 పరుగులు చేసింది.
ఇక 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్… సులభంగా ఛేదించింది. భారత బౌలింగ్ విభాగం ప్రభావం చూపడంలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ టాపార్డర్ విరుచుకుపడటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ తమ “బజ్బాల్” మంత్రాన్ని కొనసాగించి సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.