పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఉపరితల ద్రోని ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విపరీతమైన ఉక్కపోతతో పాటు వాడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనం ఇళ్ల నుండి బయటికి రావాలంటే జంకుతున్నారు.
ఉదయం 11గంటల నుండి సాయంత్రం వరకు జనం ఇండ్ల నుండి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం రహదారులన్నీ జనంలేక బోసిపోయాయి. శీతల పానీయాల దుకాణాలతో పాటు కొబ్బరి బొండాల బండ్ల వద్ద కిక్కిరిసిన వాతావరణం కనబడుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల గిరాకీ అమాంతంగా పెరిగిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.