- ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ముందుకు వస్తున్న ప్రజలు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దశాబ్దాల సమస్యలకు రోజుల్లో హైడ్రా పరిష్కారం చూపడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, చెరువులు, నాలాల కబ్జాలను చూసి తమకెందుకులే అనుకోకుండా.. హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈరోజు సోమవారం హైడ్రా ప్రజావాణి ఫిర్యాదుల్లో బాధితుల కంటే సామాజిక కోణంలో ఆలోచించేవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 54 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయి. ఫిర్యాదులను హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించారు. ఫిర్యాదుల వెనుక ఉద్దేశాలను అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్స్, సాటిలైట్ ఇమేజీలతో ఫిర్యాదులను పరిశీలించి తదుపరి చర్యలను సూచించారు.