జీవోనెం.9పై హైకోర్టు స్టే…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్ లో కీలకమైన జీవోనెం.9పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్టే విధించింది. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి నిన్నటి నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం విచారణ ప్రారంభించిన హైకోర్టు జీవో నెం.9పై స్టే విధిచింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. కాగా, హైకోర్టు నుంచి స్టే కాపీలు అందగానే ఎన్నికలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ రోజు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి (AG Sudarshan Reddy) వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు.
బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాబాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్ గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విదిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.