హైదరాబాద్ – ఒకవైపు దేశం కోసం మనవాళ్లు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ధాన్యం రాశులను గాలికి వదిలేసి అందాల రాసుల చుట్టూ సీఎం తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర పంటను కొనడం లేదు.. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగకుండా జాప్యం చేస్తున్నారు.. రైతులకు 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది.. రైతు పెట్టుబడి సాయం అందించడంలో కూడా జాప్యం కొనసాగుతుందని హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ధాన్యంలో తరుగు తీయమని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ, క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఓ రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు.. నిన్న మహబూబాబాద్ జిల్లాల్లో కిషన్ అనే రైతు చనిపోయారు.. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఎండ దెబ్బతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి సహజ మరణాలు కావు.. ప్రభుత్వం చేసిన హత్యలు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సీఎం సెక్రటేరియట్ ముఖం చూడట్లేదు.. ఉంటే జూబ్లీహిల్స్ పాలస్ లో.. లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి అందాల పోటీలపై రివ్యూ చేస్తున్నారు.. ఈ సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద ఎందుకు లేదు అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఇక, ఢిల్లీకి వెళితే అప్పు పుట్టట్లేదని సీఎం రేవంత్ అంటున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. పాకిస్థాన్ కు అయినా అప్పు పుడుతుంది కానీ, మన సీఎంకు అప్పు ఇవ్వట్లేదు అని సెటైర్లు వేశారు. నా మీద వచ్చే ఆరోపణల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు.