కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు సభలు లాంఛనంగా ప్రారంభమవుతాయి..
ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్. వేదికగా పోస్టు చేశారు. తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమని, ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని వ్యాఖ్యానించారు.
తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యంగా పేర్కొన్నారు.ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా..ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎదుర్కొన్న పరీక్షల్లో ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని.. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టామని అన్నారు.
మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని,’స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో…. ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి…. అదే నా ఆశ… ఆకాంక్ష.. అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు.