వాజేడు, మే 7 ఆంధ్రప్రభ : ప్రతి పేదవాడి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ… పేదవాడి కల పేదవాడి కొడుకు, బిడ్డ కల నెరవేర్చాలని అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని, మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ 15, 16 నెలల్లో ఈ కార్యక్రమంలో ఎక్కడా చిన్న ఇబ్బంది, తప్పు జరగవద్దని, పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నిర్మించే దాంట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందన్నారు.
4వేల మంది యువతకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి జూన్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 6వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ కట్టే కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20లక్షల ఇల్లు కట్టించాలన్నారు. ప్రభుత్వం ఆలోచనలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన పేదవాళ్లు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ శ్రీనన్నగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, ములుగు జిల్లా ఎస్పీ శబరిష్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, ఎంపీఓ శ్రీకాంత్ తహసీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం..
ములుగు జిల్లా వాజేడు మండలంలో తొలిసారిగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పూలబొకే, శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబు రాజు, సొసైటీ అధ్యక్షులు ఎగ్గడి అంజయ్య, ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు, కాకర్లపూడి కళ్యాణ్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
