ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి / గణపురం(ఆంధ్రప్రభ ) : ముస్లీం సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డ, గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ఈద్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా శనివారం ముస్లీం మత పెద్దలతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందరర్భంగా ఎమ్మెల్యే జిల్లా ప్రజలకు ఈద్-ఉల్ ఆదా (బక్రీద్) శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ… త్యాగానికి, సహనానికి, మతసామరస్యానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందన్నారు. ముస్లీం సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మజీద్ లకు, షాదీఖానాలకు, కబరస్తాన్లకు నిధులిస్తూ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. ఉపాధి, ఉద్యోగాల్లో, రుణ సౌకర్యాల్లో ముస్లీంలకు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. రాజీవ్ యువ వికాస్ లో ముస్లీం సోదరులకు ప్రత్యేక కోటా కేటాయించామన్నారు. పేద ముస్లీం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టే రాజకీయ పార్టీలను ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలను సమానంగా భావిస్తుందని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ముస్లీం సోదరులు, అన్నివర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
