ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి

  • పెద్దపోర్ల సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కాశమ్మ

ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజాసేవ చేసి పెద్దపోర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బోయినపల్లి కాశమ్మ అన్నారు.

ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశమ్మ మాట్లాడుతూ, విద్యావంతులైన తన కుమారుల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మహిళగా తనను ఆదరించి ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొంటూ, తనను గెలిపిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

చెరువుకట్ట వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గెలుపు సాధిస్తే ఆ సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనను ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే పెద్దపోర్ల గ్రామ రూపురేఖలు మారుస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవికుమార్, మాజీ ఎంపీటీసీ శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply