మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు

మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు
- న్యాయమూర్తి బాలా త్రిపురసుందరి దేవి
- కెయూ లో మహిళా దినోత్సవ వేడుకలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : దేశంలో స్వాతంత్ర్యానికి ముందు నుండే ఎందరో మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు లభించాయని అదనపు న్యాయమూర్తి బాలా త్రిపురసుందరి దేవి పేర్కొన్నారు. శనివారం కృష్ణా విశ్వవిద్యాలయం మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతిరావు పూలే దంపతులు, డా. బిఆర్ అంబేడ్కర్, రాజరామోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి మహనీయుల త్యాగాలతో సాంఘిక దురాచారాలు రూపుమాపడం జరిగిందన్నారు. జర్మనీ దేశంలో తొలిసారి మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైందన్నారు.
గౌరవ అతిధి రెండవ అదనపు న్యాయమూర్తి దేవస్త దీపికా మాట్లాడుతూ ఎటువంటి ఆర్థికభారం లేకుండా, పోలీస్ కేసులు పెట్టకుండా కూడా నిర్భయంగా మహిళలు న్యాయస్థానం ను ఆశ్రయించవచ్చని చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రం లో ఓ మహిళ పోరాటం వల్ల పోష్ చట్టం రూపొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల చోటు చేసుకుంటున్న దుష్పరిణామాలను విశదీకరించారు.

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విద్యార్దినిలు తరగతి పాఠాలు వినేందుకే పరిమితం కాకుండా ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. పేద విద్యార్దిని ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా అతికొద్ది మందే వినియోగించుకుంటున్నారు అని చెప్పారు.
మహిళా సాధికారిత విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎల్. సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అర్చిష్మా, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాకాల సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు.
