Formula-E case | ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు !

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో రెండోసారి ఆంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఎదుట హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు, వేలాది మంది కార్యకర్తలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, రేవంత్ లాగ తెలంగాణ తలదించుకునే పనులు తానేం చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తనపై 14 అక్రమ కేసులు పెట్టారని, అవసరమైతే మరో 1400 కేసులు పెట్టినా భయపడేది లేదని ధీటుగా పేర్కొన్నారు. “ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు,” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన వైఫల్యాలను ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు నన్ను లక్ష్యంగా చేసుకుంటోంది అన్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగాయని, ఇప్పటికీ నిధులన్నీ నిర్వాహకుల ఖాతాల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

నన్ను అరెస్ట్ చేస్తే చేయండి. నేను జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ కోసం తీసుకున్న ఈ చర్యలపై నాకు గర్వం ఉంది అంటూ ధైర్యంగా స్పందించారు.

ఇదిలా ఉండగా, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ ఈ కేసును రాజకీయ వేధింపులుగా అభివర్ణిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

Leave a Reply