ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసమే.

ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసమే.
తిరుపతి ప్రతినిధి ఆంధ్ర ప్రభ: తీవ్ర తుఫాన్ ప్రభావం కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. ప్రజల భద్రతను కాపాడే దృష్ట్యా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలపై ప్రయాణించే భారీ వాహనాలు, కంటైనర్లు, లారీలు, ప్రైవేట్, వాణిజ్య వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి జాతీయ రహదారుల వెంట గుర్తించిన హోల్డింగ్ ప్రాంతాల్లో భారీ వాహనాలను నిలిపివేశారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, వాతావరణ విభాగం, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఇచ్చిన హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ఈ చర్యలు చేపట్టారు.
ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాదని. ప్రజల భద్రతను కాపాడటమే ప్రధాన లక్ష్యం అని ఎస్పి సుబ్బరాయుడు అన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ ఆంక్షలు ఎత్తివేస్తామని, వాహనదారులు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రాకుండా జాగ్రత్త వహించాలనీ, ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ, వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థల నుండి వెలువడే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112, పోలీస్ వాట్సాప్ నంబర్: 80999 99977ను సంప్రదించాలన్నారు.



