గుడివాడలో విద్యార్థిని బలవన్మరణం..

గుడివాడలో విద్యార్థిని బలవన్మరణం..
గుడివాడ – ఆంధ్రప్రభ : ‘అనారోగ్యంతో పరీక్ష బాగా రాయలేకపోయాను. పరీక్షలో ఉత్తీర్ణురాలిని కాలేనేమో.. అమ్మా, నాన్నా క్షమించండి. మీరు నా కోసం ఎన్నిసార్లు ఫీజులు చెల్లిస్తారు. మళ్లీ నేను మీతో ఖర్చు చేయించలేను. మళ్లీ పరీక్ష రాస్తే పాస్ అవుతానో లేదో క్షమించండి..’ అంటూ ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఉత్తరం రాసి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గంగాధరపురానికి చెందిన ఓ కుటుంబం ఉంటోంది. ఆ ఇంటి రెండవ కుమార్తె (16) గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన ఆమె డ్రాయింగ్ పరీక్ష రాస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆ క్రమంలో సమయం వృథా కావడంతో పరీక్ష సరిగా రాయలేక పోయానన్న దిగులుతో ఉంది. ఈ విషయం తల్లికి కూడా చెప్పి బాధపడింది. ఆమె మళ్లీ రాసుకోవచ్చని ధైర్యం చెప్పింది. అయినప్పటికీ… తన కోసం చాలా కష్టపడి తల్లి దండ్రులు పని చేసి పరీక్ష ఫీజులు కడుతున్నారని మథన పడింది.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న అరటి కాయలు పండడానికి వినియోగించే లిక్విడ్ను ఎవరూ లేని సమయంలో గురువారం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి ముందు ఆమె ‘మీరు నాకోసం ఖర్చు చేస్తున్నారు. కానీ, నేను ఉత్తీర్ణురాలిని కాలేనేమో. దయచేసి క్షమించండి. మీరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ తల్లిదండ్రులకు ఓ ఉత్తరం రాసింది. తాలూకా,2 టౌన్ పోలీసులు వివరాలు సేకరించారు.
