Sangareddy | ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి, మే 5 (ఆంధ్రప్రభ) : క్షణికావేశం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్న‌ మవుతున్నాయి. జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

భార్య మంజుల (35) కి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి సుభాష్ (40) ఉంటున్నాడు. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడు రిథిక్ మర్యాన్(9), కుమార్తె ఆరాధ్య(5)కి ఉరివేసి… అనంతరం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడ్డు సుభాష్. ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply