WGL | రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే గండ్ర

గణపురం, జూన్ 5 (ఆంధ్రప్రభ): రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో తహశీల్దార్ సత్యనారాయణ స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూమికి పట్టాలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా పట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

ఈనెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన ప్రతీ దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సుల్లో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *