WGL | అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

చిట్యాల, మార్చి 11 (ఆంధ్రప్రభ) : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారు శాంతినగర్ కు చెందిన మోత్కూరి కుమార్ (35) యువ రైతు అప్పుల బాధతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం, వివరాలు ఇలా ఉన్నాయి.. శాంతినగర్ కు చెందిన రైతు కుమార్‌ తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పత్తి, మిరప పంటలు పెట్టి, పంటలు పండకపోవడంతో రూ.10లక్షలు అప్పుల పాలైనట్లు తెలిపారు. యాసంగిలో తన మొక్కజొన్న పంట అడవి పందులు, కోతుల బెడద వల్ల గత నాలుగు రోజులుగా రాత్రిపూట అక్కడే నిద్రిస్తున్నాడు.

ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి పంట చేనులో పడుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే మంగళవారం ఉదయం గ్రామ శివార్లలో రోడ్డు పక్కన కుమార్ నురుగులు కక్కుతూ విగత జీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సెకండ్ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు. అప్పుల బాధతో రైతు మృతిచెందడంతో కుటుంబంతో పాటు శాంతి నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *