Exclusive | ఆర్టీసీ చైర్మన్ ఇలాఖాలో డొక్కు..తుక్కు బప్సులే దిక్కు

ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ, – కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం.. ఇప్పుడు అభివృద్ధి దిశలో ఉరుకులు పరుగులు పెడ్తోంది. బందరు పోర్టు పనులు యమస్పీడ్ గా సాగుతున్నాయి. పోర్టు కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ కూడా నేను సైతం అంటూ బందరుతో అనుబంధానికి సిద్ధమవుతోంది. నిమ్మకూరులో బెల్ కంపెనీ అప్పుడే పలకరిస్తోంది.ఇక అతి త్వరలోనే బందరు జనంతో కిటకిటలాడబోతోంది. ఇలాంటి స్థితిలో .. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పుట్టినూరు.. సొంత ఇలాఖా బందరులో ఆర్టీసీ పనితీరు మరీ దారుణంగా మారింది. ప్రైవేటు ట్రాన్స్ పోర్టర్లకు లాభం చేయటమే ధ్యేయంగా కాలం గడుపుతోంది. గత ఐదేళ్లల్లో తుప్పు పట్టిన, డొక్కు బస్సులతో కాలక్షేపం చేస్తూ.. ప్రయాణికులను దూరం చేసుకుంది. దగ్గర చేసుకునే ప్రయత్నం అసలు జరగటం లేదు.

ఇటీవల జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే.. బందరు ఆర్టీసీ అధికారుల స్వలాభేక్ష ఎంత దారుణంగా మారిందో అర్థం కాగలదు. మచిలీపట్నం నుంచి రెండు ఏసీ బస్సులను నడుపుతోంది. ఈ రెండు బస్సులూ.. ఏదోక సమస్యతో దారి మధ్యలో ఆగిపోతున్నాయి. గత మంగళవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇంద్రా ఏసీ బస్సు పిల్లలమర్రి ఏరియాలో ఆగిపోయింది.

ఏసీ మిషన్ కు నీరు అందించే పైప్ పగిలిపోయింది. ఇక డ్రైవరు బాగుచేయటానికి విపలయత్నం చేసి… కడకు డిపో అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని బందరు చేర్చటానికి సూర్యాపేటలోని ఆల్టర్ నేట్ బస్సును… కేవలం అరు కిలోమీటర్లలో ఆగిన ఇంద్రా బస్పు ప్రాంతానికి చేర్చటానికి అధికారులు గుంపుచింపులు పడ్డారు.

పైగా హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న బస్పుల్లో ప్రయాణికులను పంపించాలని ఓ సలహా ఇచ్చారు. అప్పటికే డ్రైవరు ఈ ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు. వేసవి సెలవులు కావటంతో ఏ బస్సూ ఖాళీగా లేదు. ఈ స్థితిలో విజయవాడ డిపో బస్సులు ఆగలేదు. ఎట్టకేలకు ఓ గంటన్నర వ్యవధిలో బందరు డిపో సూపర్ లగ్జరీ బస్సు వచ్చింది.

ఇందులో 36 సీట్లే ఉన్నాయి. మిగిలిన నలుగురుని ఏ బస్సులో పంపించాలి? కానీ ఈ బస్సు పిల్లలమర్రిలో ఆగిన 15 నిముషాలకే ఏపీ 16 జెడ్ 0707 నైట్ రైడర్ బస్సు వచ్చింది. ఆ బస్సు డ్రైవరు కూడా ఇంద్రా బస్సు డ్రైవరుకు సాయం చేశాడు. లగ్జరీ బస్సు ఎక్కలేకపోయిన నలుగురిని తన బస్సులో బందరుకు చేర్చాడు.

సరీగా 4.30 గంటలకు బయలు దేరిన ఈ రెండు బస్సులు బందరు చేరే సరికి 9.00 గంటలైంది. అంటే .. 1.30 గంటలు ప్రయాణికులు పడిన బాధ అంతా ఇంతా కాదు. అనవసరంగా ఆర్టీసీ బస్సు ఎక్కాం జనం తిట్టుకున్నారు. అంటే ఆర్టీసీ బస్సుపై జనానికి ఇంత ఏహ్య భావం ఎందుకు కలుగుతోంది?

ఇంద్ర ఆగిన మూడోరోజే.. నైట్ రైడర్ నరకం

ఇది సరే… గురువారం రాత్రి హైదరాబాద్ లో బయలుదేరిన 0707 నైట్ రైడర్ బస్సు నందిగామ చేరుకునే సరికి.. మొరాయించింది. సుమారు 4.30 గంటలకు లైట్లు డిమ్ కొట్టాయి. క్రమంగా ఇంజన్ ఆగిపోయింది. అంటే బస్సులో కరెంట్ సప్లయి ఆగిపోయింది. ఈ బస్సులో 42 మంది ప్రయాణికులకు ఇక నరకం ప్రారంభమైంది. బందరు డిపో బస్సులన్నీ అప్పటికే కంచిక చర్ల చేరుకోవటంతో.. ఇక విజయవాడ బస్సులను ఆపి ఒక్కొక్క బస్పులో ప్రయాణికులకు విజయవాడకు చేర్చారు.

ఈ స్థితిలో ఉయ్యూరు, పామర్రు ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడలో ఆ సమయంలో బందరు నాన్ స్ఠాప్ బస్సులే ఉంటాయి. ఆ తరువాత పల్లెవెలుగు బస్సులు లైన్ లోకి వచ్చిన తరువాత ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకున్నారు.

ఇక ఇబ్రహీంపట్నం డిపో నుంచి వచ్చిన మెకానిక్ మరమ్మత్తులు నిర్వహించి నైట్ రైడర్ ను 10.30 గంటలకు వదిలారు. ఇదండీ బందరు డిపో బస్సుల పరిస్థితి.

కండీషన్ లేని బస్సులతో చెలగాటం బందరు డిపో అధికారులు కండీషన్ లేని బస్సులతో చెలగాటం ఆడుతున్నారని ఈ ఉదంతాలు ఓ ఉదాహరణ మాత్రమే. డిపో నుంచి బయలుదేరే బస్సు పరిస్థితిని ఎందుకు అంచనా వేయటం లేదు. డిపోలో బాగున్న బస్సు రోడ్డు ఎక్కిన తరువాత ఎందుకు ఆగిపోతుంది.

తాగినోడే తాళ్ల పన్ను కట్టాలన్నట్టు.. బస్సు ఆగితే డ్రైవరు సరీగా తోలలేదని సర్థిఫికెట్టు ఇవ్వటం ఇక్కడ అలవాటుగా మారిందంటే కేవలం ఆరోపణ కాదు. అసలు డిపో మెకానిక్ పనితీరును ఎందుకు ప్రశ్నించరు? ఇంజన్ పికప్ ను తగ్గించి .. ఆయిల్ ఆదా చేస్తే సరిపోతుందా? రెండు లీటర్ల ఆదా కోసం ఇంత కక్కుర్తి అవసరమా? ఈ సంగతి పక్కన పెడితే.. డిపో అధికారుల ఆశలు అన్నీ ఇన్నీ కావు.

ఆయిల్ వాడకం తగ్గాలి. జనం బస్సులు ఆక్యుపెన్సీ రేటు పడిపోయినా… చేతికి డబ్బులు రాకపోయినా పర్వాలేదు. డిపోలో ఆయిల్ మిగిలితే చాలు. అటు ఆర్ ఎం, ఇటు డీఎం సంబంర పడిపోతారు. ఇక డిపోలో ఛీప్ మెకానిక్ .. హాయిగా కాలం గడిపేస్తారు. బస్పు ఆగితే.. తమ తప్పుకాదని డ్రైవర్లపై నెపం నెట్టేస్తారు. ఏళ్లకు ఏళ్లు ఇదే డిపోలో తిష్ట వేసి.. ఇక్కడ వచ్చే తాయిలాల కోసం తపించటానికి అలవాటు పడ్డారని ఆర్టీసీ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు.

బందరు డిపోను దెబ్బతీసిందెవరు ? బందరు ఆర్టీసీ డిపో ఒకప్పుడు లాభాల బాటలో నడిచింది. చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం, పలాస ప్రాంతాలకు రెగ్యులర్ గా బస్సులు ఉండేవి. ఇక విజయవాడకు నాన్ స్టాప్ బస్పులు రయ్ రయ్ అంటూ తిరిగేవి. ఈ బస్సులన్నీ కిటకిటలాడేవి.

ఇదేం ఖర్మమో? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి బందరు జనం ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. సుమారు 45 సర్వీసులను రద్దు చేశారు. చైన్నై, బెంగళూరు, తిరుపతి సహా.. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులన్నింటినీ రద్దు చేశారు. ఇలా రద్దు చేయటంతో ఎవరికి లాభం కలిగింది?

బందరు కేంద్రంగా ప్రైవేటు ట్రావెల్స్ కు ఇబ్బడి ముబ్బడిగా జనం రద్దీ పెరిగిన మాట వాస్తవం కాదా? బందరు నుంచి చైన్నె, బెంగళూరు, కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు ప్రైవేటు బస్సులు లాభాలతో నడుస్తుంటే.. ఆర్టీసీకి నష్టం ఎందుకు వచ్చింది? ప్రైవేటే బస్సులే జనానికి ఎందుకు దిక్కుగా మారాయి? ఒక్కసారి ఆర్టీసీ పెద్దలు పరిశీలించాలి.

ఆర్టీసీ బస్సులో టిక్కెట్టు బుక్ చేద్దామంటే.. అవసరమైన సీట్లన్నీ బ్లాక్ చేస్తున్నారు. అదే మంటే ఎంపీలు, ఎమ్మెల్యే కోటాలని చెబుతున్నారు. నిజానికి ఏ ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు? కనీసం ఆర్టీసీ చైర్మన్ కూడా మచిలీపట్నం నుంచి విజయవాడ తన కార్యాలయానికి కారులోనే వెళ్తున్నారు. మరి వీరికి ప్రత్యేక కోటా దేనికి? ఆర్టీసీ ఆదాయానికి ప్రయాణికులు అవసరమా? ప్రజాప్రతినిధులు అవసరమా? కేవలం ఇలా సీట్లను బ్లాక్ చేస్తే.. తమకు అనుకూల సీట్ల కోసం జనం ప్రైవేటు బస్సులకు ఎగబడతారు. అంటే సీట్లను బ్లాక్ చేసి.. ప్రైవేటు ఆపరేటర్లకు ఆర్టీసీ అధికారులే తమ ఆదాయాన్ని వడ్డిస్తున్నారంటే ఆరోపణ కాదు.

ఇక బందరు డిపో నుంచి నాన్ స్టాప్ బస్సుల నిర్వహణలోనూ అధికారుల ధొరణి పూర్తిగా విమర్శనాంశం. సాధారాణ నాన్ స్టాప్ బస్సు ఎక్కితే విజయవాడ చార్జీ రూ.105 లు. అదే డీలక్స్ బస్సు ఎక్కితే రూ.135లు టిక్కెట్టు కొనాలి. ఆర్డనరీ బస్సుల కంటే డీలక్స్ బస్సులే ప్లాట్ ఫారం మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మధ్యలో సూపర్ లగ్జరీ బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ నాన్ స్టాప్ బస్సులు ఎక్కితే.. ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేలోనూ సగటు వేగం 45 కిలోమీటర్లు మించదు. అదే మంటే భద్రత కోసం వేగం కంటే ప్రాణం మిన్నా అనే పేరుతో .. ఆయిల్ వినియోగం తగ్గించటానికి డిపో అధికారులు ఈ వ్యూహం అమలు చేస్తున్నారు.

ఈ ప్రయాణాలకు విసుగు చెందిన ప్రయాణికులు రూ.100ల చార్జీతో టాటా ఏస్ వాహనాల్లో విజయవాడకు కేవలం గంటన్నరలో చేరుతున్నారు. ఇలా నాన్ స్టాప్ ల పేరుతో ఆదాయానికి గండి కొట్టారు. ఏసీ బస్సుల్లో మరీ దారుణం మచిలీపట్నం నుంచి హైదరాబాద్ బయలు దేరే బస్సులను పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మీదుగా ఏసీ బస్సులను నడుపుతున్నారు.

ఎందుకంటే.. మచిలీపట్నం నుంచి ఈ బస్సుల్లో 15 మంది కూడా బయలుదేరటం లేదు. ప్రైవేటు బస్సులు కిటకిటలాడితే.. ఆర్టీసీ బస్పులు మాత్రం ఖాళీగా బయలుదేరుతూ.. ఆక్యుపెన్సీ కోసం పామర్రు, ఉయ్యూరు ప్రయాణికుల బతిమిలాడుతున్నారు. వాస్తవానికి అవనిగడ్డ నుంచి ఏసీ బస్సు కూడా ఉంటుంది. ఈ బస్సు కూడా పామర్రు, ఉయ్యూరు మీదుగా విజయవాడకు చేరుతుంది. కానీ బందరు అధికారులు మాత్రం రూటు మార్చి నడుపుతున్నారు. ఇక ఇక్కడే అసలు తిరకాసు, బందరులో రాత్రి 10.00 గంటలకు బయలుదేరిన ఏసీ ఇంద్రా అర్ధరాత్రి 12.00 గంటలకు విజయవాడకు చేరుతుంది. మచిలీపట్నంలో నాన్ స్టాప్ బస్సు మిస్ అయితే.. ఈ ఇంద్రా బస్సు ఎక్కితే రూ.190లు చార్జీ చెల్లించాలి. నైట్ రైడర్ ఎక్కితే రూ.240లు టిక్కెట్టు తీసుకోవాలి. పల్లెవెలుగు బస్సులో మాదిరిగా ఏసీ బస్పులో బెజవాడ చేరటానికి జనం ఒప్పుకుంటారా? ఇలా ప్రశ్నలు సంధిస్తే.. ఆర్టీసీ యాజమాన్యం పెదవి విప్పటం కష్టమే. ఇప్పటికైనా ఆర్టీసీ చైర్మన్ ఈ సమస్యలపై దృష్టి సారించి.. బందరు ఆర్టీసీని కాపాడాలని జనం ప్రాధేయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *