Engineering Officers | సిబ్బంది వసతి గృహాల పరిశీలన

Engineering Officers | సిబ్బంది వసతి గృహాల పరిశీలన
- శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవదాయశాఖ కమిషనర్
Engineering Officers | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం దేవదాయ కమిషనర్ వచ్చారు. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మించిన సిబ్బంది వసతిగృహాలను దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వసతి గృహ సముదాయాలలో వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్కు కూడా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. అంతర్గత రహదారులతో పాటు గృహ సముదాయంలో తగినంతగా వీధిలైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వసతిగృహాల పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కలను నాటాలని ఆదేశించారు. ముఖ్యంగా కదంబం, బాదం, వేప మొదలైన చెట్లను నాటేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వసతిగృహాల సముదాయం వద్ద చిన్న ఆలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ఆదేశించారు.
కాగా మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి.హెచ్. కె. స్మాల్, 1 – బి.హెచ్. కె. బిగ్ మరియు 2 – బి.హెచ్.కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మించిందన్నారు. 1 – బి.హెచ్.కె స్మాల్ నందు 108 గృహాలు, 1 – బి. హెచ్. కె. బిగ్ నందు 108 గృహాలు, 2 బిహెచ్ కె నందు 81 గృహాలుగా మొత్తం 297 గృహాలు నిర్మించబడ్డాయన్నారు. ఈ పరిశీలనలో దేవదాయశాఖ చీఫ్ ఇంజనీరు జి.వి.ఆర్.శేఖర్, దేవదాయశాఖ స్థపతి పి. పరమేశ్వరప్ప, దేవదాయశాఖ శిల్పవిభాగపు సలహదారు ఎస్. సుందర్రాజన్, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
